ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్
|
ఆంధ్రాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్...పెరిగిపోతున్న అనుమానితులు.. బీ అలెర్ట్ |
సర్వత్రా వ్యాపించిన కరోనా భయం అంతకంతకూ విస్తరిస్తోంది. చైనాలో స్టార్ట్ అయి.. చూస్తుండగానే యావత్ ప్రపంచాన్ని చుట్టేయటమే కాదు.. కొన్నిదేశాల్లో దారుణమైన పరిస్థితులకు ఈ సూక్ష్మజీవి కారణమైంది. ప్రపంచం సంగతి పక్కన పెట్టి.. మన దేశంలో.. అందునా తమ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఐదు కేసులు (ఒక కేసు విషయంలో స్వస్థత పొంది డిశ్చార్జ్ అయ్యారు కూడా) నమోదు కాగా.. ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఒక కేసు మాత్రమే నమోదైంది.
ఇదంతా చూస్తున్నప్పుడు బాగానే ఉన్నా.. పెను ప్రమాదం పొంచి ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఏపీలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా అనుమానిత కేసులు పెద్దగా లేనప్పటికీ.. గడిచిన ఒకట్రెండు రోజుల్లో అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇది కాస్తా 22కు చేరుకోవటం ఆందోళనను కలిగిస్తోంది. దేశంలో కరోనా వైరస్ రెండో దశలోకి అడుగు పెట్టిందన్న అధికారిక ప్రకటనతో అనుమానితుల సంఖ్య పెరిగే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. దీనికి తోడు.. ఏపీలో పెరుగుతున్న అనుమానితులు నివసిస్తున్న జిల్లాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.